Saturday, November 29, 2008

Salute to our heroes


The peace and welfare of Indians will be secure only as we cling to the watchword of true patriotism.

“Our Country! When right keep it right; when wrong, set it right!”




A patriotic salute to our heroes

who sacrificed their lives to protect all our lives.

JAI HIND..!!!


Thursday, November 27, 2008

దేవుడా.. ఒకసారి ఇటువైపు చూడు నాయనా.. ఏమిటీ వైపరీత్యం..??

కష్టాల్లో, బాధల్లో కూరుకుపోయి, ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో.. నిస్సహాయంగా ఉన్నప్పుడు.. దేవుడున్నాడని నమ్మే మనుషులు అనుకునే మాట ఇది. నాకు ఇప్పుడలాగే దేవుడిని ఎలుగెత్తి పిలవాలనిపిస్తుంది మళ్ళీ మరో మారణహోమాన్ని ముంబై టెర్రర్ రూపంలో చూస్తుంటే.. రోడ్ల మీద, హోటళ్ళలో, విమానాశ్రయంలో, ఆసుపత్రుల్లో..ఎన్నో చోట్ల విచక్షణారహితంగా బాంబులు, కాల్పులు జరుగుతుంటే.. అక్కడ చిక్కుకుపోయిన సాటి మనుషులను ప్రత్యక్షంగా టీవీలో చూస్తుంటే ఎలా స్పందించాలో తెలీలేదు. నిస్సహాయంగా కళ్ళల్లోంచి కన్నీటి బొట్లు రాలాయి అంతే.. :( అంతకు మించి ఏమనాలో తెలియట్లేదు. వారానికొక కొత్త సినిమా విడుదలైనట్టుగా, బాంబు దాడులు జరుగుతున్నాయి మన దేశంలో.. దీనికి కారణాలు ఎవరైనా గానీ, సామాన్య జనం బలైపోతున్నారు. అయినా.. ఎక్కడని తప్పించుకోగలం?? ఆసుపత్రికీ, రోడ్డు మీదకీ, గుళ్లకీ, గోపురాలకీ, బస్ స్టేషన్ లకీ, రైలు స్టేషన్లకీ వెళ్ళకుండా ఎలా బ్రతకడం..?? అసలు ఇలాంటి దుశ్చర్యలకీ పాల్పడే వాళ్ళకి వాళ్ల గమ్యం ఏంటో తెలుసా అని నాకొక సందేహం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ.. వాళ్లు చచ్చీ, జనాల్నీ చంపి, చివరికి ఎవరికీ ఏమి కట్టబెడదామని వాళ్ల ఆరాటం? ఈ పవిత్ర కార్యం చేసి వీరులై చచ్చి స్వర్గానికెళ్లాలనా? ఏమో.. వాళ్ళకే తెలియాలి మరి. ఏదో పత్రిక లో చూసాను. టెర్రరిస్టులు సాంకేతికంగానే కాదు, విజ్ఞాన పరంగా కూడా ముందున్నాం అని నిరూపించుకోడానికి ఏవో ప్రభుత్వ వెబ్ సైట్లను స్వాధీనపరుచుకున్నారు అనీ... అసలు మనిషికి చదువు, విజ్ఞానం ఎందుకో నాకర్ధం కాలేదు నాకు.. అంత గొప్పగా చదువుకుని ఉండి.. మరి వాళ్ల బుర్రలో ఏమి పురుగులుంటాయో.. ఇంత మూర్ఖమైన పనులకి పాల్పడుతుంటారు. పైగా దేవుడి పేరు చెప్పుకునీ మరీ అఘోరిస్తుంటారు. హయ్యో.. రామా..నాగరికత ఎటు పయనిస్తోంది తండ్రీ..?? మాకెలాగూ తెలియట్లేదు.. నీకేమైనా తెలుస్తుందా???

ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోవడం మాత్రమే కాదు. ఈ హింస వల్ల మరెన్నో కోణాల్లో నష్టం వాటిల్లబోతోంది కదా..! ఎన్నో కోట్లమంది పౌరులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, రైతులుగా, కూలీలుగా, ఎన్నో రకాల ఉద్యోగాలను ఎంతో కష్టపడి బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ మన దేశాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్తున్నారు. వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలు కష్టపడి పెంచిన దేశ ప్రతిష్టనీ, దేశాభివృద్ధినీ.. ఇలాంటి తీవ్రవాదుల క్రూరమైన చర్యలు ఒక్కసారిగా నేలమట్టం చేస్తున్నాయి.

ముంబై మన దేశ వాణిజ్య రాజధాని కదా..! ఎన్నో దేశాల నుంచి ఎంతో మంది ఎన్నో పనుల మీద అక్కడికి వస్తారు. అలా వచ్చిన వాళ్లందరూ ఎక్కువగా బస చేసే హోటళ్ళలో తాజ్ మహల్, ఒబెరాయ్ ముందు వరసలో ఉంటాయి. ఇప్పుడు ఇంత ఘోరంగా అక్కడ జరిగిన భద్రతా వైఫల్యాన్ని చూసాక.. ఎవరైనా మన దేశానికి ఏ మొహం పెట్టుకుని వస్తారు?? క్రికెట్ లాంటి క్రీడల కోసం వచ్చే విదేశీయులూ, ఎన్నో వ్యాపారాల నిమిత్తం వచ్చే వాళ్లు.. ఎందరెందరో ఆ హోటళ్ళలో ఉంటారట. అంతెందుకు నిన్న ఈ ఘోరం జరిగినప్ప్పుడు కూడా లోపల చిక్కుకుపోయిన వారిలో వారే చాలామంది ఉన్నారు. ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త భార్య సమేతంగా ఏదో విశిష్ట అవార్డు తీసుకోవడం కోసం ముంబై వచ్చి నిన్న ఆ హోటలో లోనే చిక్కుకుపోయారు. అదృష్టవశాత్తూ మన పోలీసులు వారిని రక్షించారు. ఇంకా ఇలాంటి వాళ్లు ఎంత మంది ఇరుక్కుపోయారో..?

వరుసగా ఇన్ని బాంబు దాడులు జరుగుతూ ఉంటే దేశంలోనే అత్యంత ముఖ్యమైన అలాంటి ప్రాంతాల్లో సెక్యూరిటీ ఎందుకు సరిగ్గా లేదు? మన ఇంటిలిజెన్స్ వర్గాలు ఏమి చేస్తున్నాయో?? ఇక్కడ మరో విషయం.. అలా అని మనం పూర్తిగా పోలీసులని నిందించలేం.. ఎందుకంటే ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా తమ వ్యక్తిగత జీవితాలని మర్చిపోయి ప్రజల కోసం ప్రాణాలు సైతం అర్పించే వారి త్యాగానికి మనం విలువ కట్టలేం కదా..! మనకి చాలా పోలీసు, మిలటరీ బలగం అన్నీ ఉన్నాయి. వాళ్లు చాలా వరకు తమ భాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. కానీ, వాళ్ళందరినీ సమన్వయ పరచాల్సిన అధికారం కలిగిన ఉన్నతాధికారులు, మంత్రులూ, ప్రభుత్వం ఏమి చేస్తున్నాయో మరి..?? అసలు వైఫల్యానికి కారణం వీళ్ళే. రాజకీయ నాయకుల సెక్యూరిటీ గురించి చూపించే శ్రద్ధలో ఏ కాస్త శ్రద్ధ అయినా దేశ భద్రతలో కూడా చూపిస్తే వీటిల్లో కొన్నీటినైనా అయినా ఆపగలిగే వారేమో అనిపిస్తుంది నాకయితే.. సామాన్య మానవుల భద్రతని ఎలాగూ తుంగలో తొక్కారు.. చివరికి దేశం పరువు మర్యాదలు కాపాడడంలో కూడా విఫలమయ్యాయి మన ప్రభుత్వాలు :( మొతానికి, తీవ్రవాదులు వాల్లనుకున్నది సాధించినట్లే ఉంది చివరికి. ఇప్పుడు ప్రభుత్వం మేల్కొని మేము చాలా భద్రతని కల్పిస్తాము ఇప్పటి నుంచి మా దేశంలో.. అదీ ఇదీ.. అని కాకమ్మ కబుర్లు చెప్తే ఎవరు నమ్ముతారంటారు? రాజకీయ నాయకులందరూ మేల్కొని ఒకరి తరవాత ఒకరు మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ చెప్పేసి.. ఆ తర్వాత వాళ్ల పనిలో వాళ్ళుంటారు. ఖండించడం తప్ప వేరే ఏమీ చేసేట్టుగా కనిపించట్లేదు పరిస్థితి.. :(

మొత్తానికి ఈ తీవ్రవాద సమస్య పెరిగి పెద్దదవుతూ.. చివరికి ప్రపంచంలో మన భారత దేశం ఉనికినే ప్రశ్నించే రోజులోస్తాయేమోనని చాలా భయంగా, బాధగా ఉంది. ఇన్ని రకాలుగా ఆలోచించి మనస్తాపం చెందడమే కానీ, మనమేమి చెయ్యాలో తెలియని అయోమయంలో, ఆవేదనలో.. ఏమనాలో తెలీక ఆ దేవుడిని పిలుస్తున్నాను.. "దేవుడా.. ఒకసారి ఇటువైపు చూడు నాయనా.. ఏమిటీ వైపరీత్యం..??" అని.

ఈ ఘోరాన్ని చూసి ఎలా స్పందించాలో తెలియక నా గుండెల్లో సుడులు తిరుగుతున్న భావావేశాన్ని మీతో చెప్పడానికి ప్రయత్నించాను. ఇది నా స్పందన మాత్రమే..! నిజానిజాల్లో ఏమైనా తేడాలుంటే మన్నించండి.

ఇన్ని జరుగుతున్నాగానీ.. ఏదో ఒక నాటికి.. ఇలాంటి హింసలు లేని ఒక అందమైన, ఆదర్శ ప్రపంచాన్ని చూస్తామేమో అనే ఒక చిన్ని ఆశ మాత్రం నాలో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఏమో మరి.. నా ఆశ ఎప్పటికీ అందని కలలాగా మిగిలిపోతుందో .. లేక నిజమై నిలుస్తుందో.. కాలమే నిర్ణయించాలి..!!

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..!!

ఈ వేళ ఘంటసాల గారి గానామృతాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. "అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం" అనే పాట 1953 లో వచ్చిన 'బ్రతుకు తెరువు' అనే చిత్రంలోనిది. చక్కటి పాటని ఘంటసాల గారు స్వీయ సంగీత దర్శకత్వం వహించి స్వయంగా ఆయనే ఆలపించారు.

ఆహా
జీవితం ఎంత ఆనందం..అపురూపం.. అనిపిస్తుంది పాట వింటుంటే.. చెవిలో తేనె పోస్తున్నట్టుగా ఉండడం అంటే ఏంటో పాట వింటే తెలుస్తుంది మనకి. సముద్రాల (రామానుజాచారి) జూనియర్ సాహిత్యం అత్యంత సరళమైన పదాలతో.. చాలా భావయుక్తంగా ఉంటుంది. పాట ఆయన సినిమాలకి రాసిన మొట్టమొదటి పాట. గానగంధర్వుడైన ఘంటసాల గానం గురించి చెప్పగలిగేంత భాష నాకు ఎలాగూ రాదనుకోండి..! మరో సంగతి ఏంటంటే సినిమాలో ఇదే పాటని P.లీల గారు కూడా పాడారు. కానీ మనం సాధారణంగా ఎప్పుడూ ఘంటసాల గారిదే వింటూ ఉంటాం. పాట కూడా బావుంటుంది చాలా.. విని చూడండి మీరే..!

రాజీ పడని జీవితం ఎవరికైనా లేదు. విషయం ఆధారంగా కొద్దిగా మార్పులతో చాలా సినిమాలు వచ్చాయంట కాలంలో.. వాటిల్లో 'బ్రతుకు తెరువు' సినిమా కూడా ఒకటి. సినిమాకి PS రామకృష్ణ గారు (భానుమతి గారి భర్త) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ANR హీరోగా నటించారు. ఈ సినిమా గురించి మీకు ఇంకా తెలిస్తే మాకు కూడా చెప్పండి.

ఇక అప్పట్లో
పాట ఆబాలగోపాలాన్నీ ఒక ఊపు ఊపేసిందట. జనాలు తోచినా, తోచకున్నా.. పాటనే పాడుకుంటూ ఉండేవారట.

ఘంటసాల
గారి పాట
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..

పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం..
పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం..
ఒడిలో చెలి మోహనరాగం.. ఒడిలో చెలి మోహనరాగం..
జీవితమే మధురానురాగం.. జీవితమే మధురానురాగం..

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం..!!

పడిలేచే కడలి తరంగం.. పడిలేచే కడలి తరంగం..
ఒడిలో జడిసిన సారంగం.. ఒడిలో జడిసిన సారంగం..
సుడిగాలిలో ఎగిరే పతంగం.. సుడిగాలిలో ఎగిరే పతంగం..
జీవితమే ఒక నాటకరంగం.. జీవితమే ఒక నాటకరంగం..

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం..!!

P.లీల గారి పాట
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..

పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం..
పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం..
ఒడిలో చెలి తీయని రాగం.. ఒడిలో చెలి తీయని రాగం..
జీవితమే మధురానురాగం.. జీవితమే మధురానురాగం..

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం..!!

చల్లని సాగర తీరం.. మది జల్లను మలయ సమీరం..
చల్లని సాగర తీరం.. మది జల్లను మలయ సమీరం..
మదిలో కదిలే సరాగం.. మదిలో కదిలే సరాగం..
జీవితమే అనురాగయోగం.. జీవితమే అనురాగయోగం..

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం..!!

Tuesday, November 25, 2008

బంగారం ముచ్చట్లు

బంగారం ముచ్చట్లు.. అనే టైటిల్ చూసి ఏమనుకుంటున్నారూ ..? అమ్మాయిలందరికీ బంగారు గాజులు, హారాలు, వడ్డాణాలూ , నగల డిజైన్లు వగైరా వగైరా..వన్నీ కళ్ళ ముందు స్లైడ్ షో లా కనిపించేసాయా.. :) అబ్బాయిలేమో.. ఏంటో.. ఈ అమ్మాయిలు.. చీరలు, నగలు టాపిక్ మాత్రం ఎన్ని యుగాలు మాట్లాడుకున్నా తనివి తీరదు.. ప్చ్.. ఏం చేస్తాం.. అని నిట్టూరుస్తున్నారా..? అలాగయితే అక్కడే ఆగిపోండలా ...!! ఎందుకంటే ఈ బంగారం ఆ బంగారం కాదుగా.. హ్హ హ్హ..హ్హా.. :)

సరే ఇంక ఎక్కువ సుత్తి కొట్టకుండా నేరుగా విషయానికి వచ్చేస్తాను. మన తోటి బ్లాగ్గర్లందరూ రాస్తున్న మంచి మంచి రాతలు చూసి నేను కూడా బాగా ఉత్సాహం తెచ్చేసుకునీ కొత్తగా ఈ ఘన కార్యానికి పూనుకున్నానన్నమాట.. అదీ అసలు సంగతి :)

ఇక 'బంగారం' విషయానికొస్తే.. మన కథలో కథానాయిక పేరు 'బంగారం' అన్నమాట..! అంటే అసలు పేరు సీతామహాలక్ష్మి అనుకోండి. కానీ, వాళ్ళాయన ప్రేమగా పిలిచే పేరు బంగారం అన్నమాట. పేరుకు తగ్గట్టుగానే అసలు సిసలైన తెలుగింటి బంగారు తల్లే..! చాలామంది తెలుగు అమ్మాయిల్లాగే తను కూడా పుట్టింట్లో చాలా గారాబంగా పెరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు ఏరి కోరి ప్రేమించి పెళ్ళాడింది రఘురాముడిని (పేరు రఘురామ్ అనుకోండి.. వినడానికి బాగుంటుందని..నేనే కొంచెం బిల్డప్ ఇచ్చాను :) మధ్యలో ఈ రఘురాం ఎవరు చెప్మా అనుకునేరు.. ఆయనే ఇందాక నేను చెప్పిన వాళ్ళాయనన్నమాట..! కొంచెం కన్ఫ్యూస్ చేసినా మొత్తానికి బాగానే పరిచయం చేసాననుకుంటున్నాను. ఏమంటారూ..?

మన రాముడేమో.. కాస్త తక్కువ మాట్లాడే రకం. కాస్త కాదుగానీ, బాగా తక్కువ మాట్లాడే రకం. మరి అతనికి దొరికిన బంగారమేమో.. మాటలుంటే చాలు.. అన్నం తినాలని కూడా మర్చిపోయే రకం :) కానీ మనసు మాత్రం వెన్నముద్ద. కూసింత పెంకితనం, కాసింత గడుసుతనం, మరి కాస్త అమాయకత్వం, బోలెడంత మంచితనం.. ఇవన్నీ కలిస్తే మన బంగారం..! మీ ఆయన ఎటూ ఎక్కువ మాట్లాడడు కాబట్టి నువ్వైనా మీ కబుర్లు మాకు కాస్త వినిపించు అమ్మడూ... అని అడిగితే సంతోషంగా సరేనంది. అందుచేత.. తీరిక వేళల్లో బంగారం మనకు వాళ్ల ముచ్చట్లు కొన్ని వినిపిస్తూ ఉంటుందన్నమాట..! మరి వాళ్ల కీచులాటలూ, వాదులాటలూ, తిట్టుకోవడాలూ, బతిమాలుకోవడాలూ, ప్రేమలూ, గీమలూ, అల్లరీ, గిల్లరీ .. ఇలాంటివన్నీ మీరు కూడా విని ఆనందించాలంటే.. తను చెప్పేదాకా వేచి చూడాలి..! చూస్తుంటారా మరి..??

Monday, November 24, 2008

వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా.. వర్షంలో తడిసే సంద్రంలాగా..

పైన పేరు చూశారుగా.. అసలు ఆ వాక్యాలు వింటే ఏమనిపిస్తుంది??
"వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా.. వర్షంలో తడిసే సంద్రంలాగా.."
ఆహా.. నాకయితే నిజంగానే వెన్నెల్లో నడిచే మబ్బుల్లో నేను విహరిస్తున్నట్టుగా ఉంటుంది ఈ పాట వింటుంటే :)

సున్నితమైన భావాలని అంత అందంగా వ్యక్తపరచగలగడం నిజంగానే మహానుభావులకు మాత్రమే సాధ్యం అనిపిస్తుంది నాకయితే..! సంగీతం కూడా హాయిగా మనసును మీటుతున్నట్టుగా ఉంటుంది. నాకు చాలా చాలా నచ్చే పాటల్లో ఇదొకటి. అందుకే ఈ వేళ మీకు కూడా ఓ సారి ఈ పాటను గుర్తు చేద్దామనిపించింది.


ఇంతకీ గుర్తొచ్చేసిందా ఈ పాట ఏంటో.. ఈ పాట 'క్రియేటివ్ డైరెక్టర్' కృష్ణవంశీ దర్శకత్వంలో 1999 లో వచ్చిన 'అంతఃపురం' అనే సినిమాలోది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సౌందర్య, సాయి కుమార్, జగపతి బాబు మొదలైన వారు నటించారు. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ కెరీర్ లో మైలురాయిలా నిలిచిపోయే పాత్రలు పోషించారు. నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు చాలా మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి.

ఏ లోకానుందోగానీ.. మహానటి సౌందర్య ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచింది. అలాంటి గొప్ప నటిని కోల్పోవడం మనందరి దురదృష్టం :( సినిమాలో విదేశాల్లో ఉండే సౌందర్య, సాయి కుమార్ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం, ఆనందంగా జీవితం గడుస్తూ ఉండే సన్నివేశాల్ని ఈ పాట రూపంలో చిత్రీకరించారు దర్శకులు. పాటల్ని చిత్రీకరించడంలో అందెవేసిన చెయ్యి కదా మన కృష్ణ వంశీది. ఈ పాటని చాలా ముచ్చటగా తీర్చిదిద్దాడు.


సంగీతం 'మ్యూజిక్ మేస్ట్రో' ఇళయరాజా గారు అందించారు. ఈ పాట వింటుంటే మనకి KV మహదేవన్ గారి సంగీతం విన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఆ శైలి, పాటలోని మాధుర్యం అలా అనిపిస్తాయన్నమాట. చిత్ర గాత్రం ఈ పాటని మరింత వినసొంపుగా మార్చింది.

ఈ పాటకి ప్రాణం మాత్రం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం అని నేనంటాను. ఒక అమ్మాయి జీవితం ఆనందంగా సాగిపోతూ ఉన్నప్పుడు తన భావాలెలా ఉంటాయో సిరివెన్నెల గారు చెప్పినట్టుగా మరెవ్వరూ చెప్పలేరేమో.. అన్నట్టుగా ఉంటుంది ఈ పాట. ప్రతీ వాక్యం సూటిగా మనసుని తాకుతుంది.


కల్యాణం కానుంది కన్నె జానకికీ..
వైభోగం రానుంది రామచంద్రుడికీ..
దేవతలే దిగి రావాలి.. జరిగే వేడుకకీ..
రావమ్మా సీతమ్మా.. సిగ్గు దొంతరలో..
రావయ్యా రామయ్యా.. పెళ్లి శోభలతో..

వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా..
వర్షంలో తడిసే సంద్రంలాగా..
ఊరేగే పువ్వుల్లో.. చెలరేగే నవ్వుల్లో..
అంతా సౌందర్యమే.. అన్నీ నీ కోసమే..!
వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా..
వర్షంలో తడిసే సంద్రంలాగా..

నాలో ఎన్ని ఆశలో.. అలల్లా పొంగుతున్నవీ..
నీతో ఎన్ని చెప్పినా.. మరెన్నో మిగులుతున్నవీ..
కళ్ళల్లోనే వాలి.. నీలాకాశం అంతా.. ఎలా ఒదిగిందో..
గగనాన్ని ఏలే పున్నమి రాజు.. ఎదలో ఎలా వాలాడో..
నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి..
చూస్తూనే
నిజమై.. అవి ఎదటే నిలిచాయి..
అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా..!!

వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా..
వర్షంలో తడిసే సంద్రంలాగా..

ఇట్టే కరుగుతున్నదీ.. మహా ప్రియమైన క్షణం..
వెనుకకు తిరగనన్నదీ.. ఎలా కాలాన్ని ఆపడం..
వదిలామంటే నేడు.. తీయని స్మృతిగా మారి.. ఎటో పోతుందీ..
కావాలంటే చూడు.. ఆనందం.. మనతో తనూ వస్తుందీ..
హాయి అంతా మహా భద్రంగా దాచి..
పాపాయి
చేసి.. నా ప్రాణాలే పోసి..
నూరేళ్ళ కానుకల్లే.. నీ చేతికీయలేనా..!!

ఆకాశం అంతఃపురమయ్యింది.. నాకోసం అందిన వరమయ్యింది..
రావమ్మా మహారాణీ.. లమ్మా కాలాన్నీ..
అందీ లోకమే.. అంతా సౌందర్యమే..!!
ఆకాశం అంతఃపురమయ్యింది.. నాకోసం అందిన వరమయ్యింది..

పాట వింటుంటే మనసుకెంత హాయిగా ఉంటుందో తెలుసుకోవాలంటే.. విని చూడాల్సిందే.. చెప్పడం కష్టం. మీరూ సారి మళ్ళీ వినండి. వెన్నెల్లో నడిచే మబ్బుల్లో విహరించి, వర్షంలో తడిసే సంద్రాన్ని తాకి రండి.

మళ్ళీ కలుద్దాం..!!

Saturday, November 22, 2008

ఓ చిట్టి కప్ప కథ..!


అనగనగా
చిట్టడవి. అడవిలో ఒక గుంపుగా కలిసిమెలసి ఉండే ఒక కప్పల గుంపు. ఒక రోజు కప్పల గుంపంతా అడవిలో గెంతుతూ గెంతుతూ సరదాగా విహారానికి బయలుదేరాయి.

గుంపులో రెండు చిట్టి కప్పలు ఉన్నాయి. అవి మిగిలినవాటికంటే మరీ ఉత్సాహంగా గెంతుతూ.. బెక బెకమని వాటి భాషలో కూని రాగాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అలా గెంతుతూ గెంతుతూ చూసుకోకుండా ప్రమాదవశాత్తూ ఒక లోతైన గుంటలో రెండు చిట్టి కప్పలూ పడిపోయాయి.

ఇంకేముందీ
.. మిగిలిన కప్పల గుంపంతా గుంట చుట్టూ చేరి తొంగి తొంగి లోపలకి చూడసాగాయి. గుంట చాలా లోతుగా ఉండడంవల్ల ఎక్కడో అడుగున ఉన్న చిట్టి కప్పలు కనిపించట్లేదు వీళ్ళకి. అలాగే లోపల చిట్టి కప్పల పరిస్థితి కూడా అలాగే ఉంది.

అప్పుడు బయట ఉన్న కప్పలన్నీ తమ అనుభవ పరిజ్ఞానం అంతా ఉపయోగించి పరిస్థితిని బాగా అర్ధం చేసుకుని బెక బెక మంటూ సలహాలు చెప్పడం ప్రారంభించాయి. గుంట చాలా లోతుగా ఉంది కాబట్టి.. 'మీరు గుంట నుంచి బయటపడటం అసాధ్యం' అని చాలా బాధపడిపోతూ తమ జాలినీ సానుభూతినీ ప్రకటించాయి.

వాటి మాటల్ని పట్టించుకోకుండా రెండు చిట్టి కప్పలూ తమ శాయశక్తులా బయటపడడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. అలా ఒక అరగంటసేపు గడిచిపోయింది. గెంతీ గెంతీ పాపం చిట్టి కప్పలు అలసిపోయాయి.
అప్పుడు మళ్లీ బయట నేల మీద ఉన్న కప్పలు తమ నైరాశ్యాన్ని ప్రకటిస్తూ 'మీరు వెలుపలికి రాలేరు. ఇంక మీ ప్రాణాల మీద ఆశలు వదులుకోండి' అని సలహా ఇచ్చాయి.

బయటి కప్పల మాటలని ఆలకించిన ఒక చిట్టి కప్ప తన ప్రయత్నాలు వ్యర్థమని తోచి గెంతడం విరమించింది. రెండో కప్ప మాత్రం బయట కప్పల మాటలని పరిగణించలేదు. గెంతుతూ గెంతుతూ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చింది. బయటి కప్పలు 'ఎందుకు అనవసరంగా శ్రమిస్తావు? చచ్చిపోయే ముందు యాతన కూడా దేనికి? బాధంతా పడిన తరవాత కూడా చావు ఎలాగూ తప్పదు కాబట్టి.. ఉన్నట్టు ఉండిపోయి ప్రశాంతంగా చనిపోవడం మేలు కదా..! అని సలహా ఇచ్చాయి.

కానీ మరి కొంతసేపు గడిచాక ..అందరూ ఆశ్చర్యపోయేట్టుగా.. గుంటలోని చిట్టి కప్ప మరింత గట్టిగా ఎగిరి గంతేసి గుంట వెలుపల నేల మీదికి వచ్చి పడింది. మిగతా కప్పలన్నీ చిట్టి కప్ప చుట్టూ చేరి 'నీ పాటికి నువ్వలా ఎగురుతూనే ఉన్నవేంటి మా మాటలు వినిపించుకోకుండా..? అని అడిగాయి ముక్తకంఠంతో.

అప్పుడు తెలిసిన కొత్త సంగతేంటంటే.. మన చిట్టి కప్పకి చెవుడు ఉందని. అందుకే గుంటలో ఉన్నంతసేపూ కూడా బయటి కప్పలు తనని ప్రోత్సహిస్తూ 'మరింత గట్టిగా ప్రయత్నించు' అని చెప్తున్నాయని అనుకున్నదట. వాటికి ఆశాభంగం కలుగజేయకూడదని భావించి, తన శక్తినంతా పుంజుకొని, ఓపికంతా కూడగట్టుకుని ఎగరసాగిందట. చివరకి బయటపడగలిగింది.

మరి గుంట లోపలే మరో కప్ప ఉండిపోయింది కదా..! అది ఎక్కువసేపు అలా నీటిలోనే స్తబ్దుగా ఉండడం వల్ల దాని ప్రాణాల మీదకి వచ్చింది. ఈలోపు బయటనుండి అన్నీ కప్పలు బెక బెకమని దానికి హితబోధలు చేసి.. ఉత్సాహపరిచాయి. మొత్తానికి అది కూడా గెంతీ గెంతీ ఎలాగో కొన ప్రాణాలతో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఏదో బ్రతికి బయటపడింది.

పట్టిన పట్టు వీడరాదనే తత్వం కప్పలకే కాదు మనిషికి కూడా అవసరమే. సాక్షాత్తూ చెవుడే ఉండక్కరలేదు గానీ, ఏదయినా కార్యం తలపెట్టినప్పుడు ఇతరులు పెట్టే భయాలనూ, సంకోచాలనూ, చెవిన పెట్టకుండా ముందుకి సాగిపోయే ధైర్యముండాలి. అప్పుడు గానీ, విజయలక్ష్మి వరించదు. అంతే కాదు.. ఒక్కరు సాహసంతో చూపిన విజయపు బాట వెనుకగా ఎంతోమంది జీవితాలకి బాసటగా నిలుస్తుంది కూడా..! అదే చిట్టి కప్ప మనకి తెలియచెప్పే గొప్ప జీవిత సత్యం..!

Friday, November 21, 2008

సుమతీ శతకం పద్యం 17

హాయ్ హాయ్..
నమస్కారం. వేళ మరో సుమతీ పద్యం మన మధుర వాణిలో..!

ఒల్లనిసతి నొల్లనిపతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!
తాత్పర్యం: తన్ను ప్రేమించని భార్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు.

పైన చూసారుగా..! స్నేహమైనా, ప్రేమైనా, చివరికి ఉద్యోగం చేయాల్సిన చోట కూడా ఇరువైపులా నుండి పరస్పర అంగీకారం, ఇష్టం ఉండాలని పద్యంలో చెప్తున్నారు.

విషయాన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా.. ఇంకా మన చుట్టూ ఉన్న సమాజంలో బలవంతపు ప్రేమలు, పెళ్ళిళ్ళు, లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. మనిషికైనా ప్రతీ విషయంలో తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. రంగు డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, సినిమా చూడాలి, ఏమి తినాలి... ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతీ ఒక్క విషయంలో మనకి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. వీటిల్లో ఒక్క అభిరుచికి గానీ, అభిప్రాయానికీ గానీ కారణాలు అడిగితే మనమెవ్వరమూ సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనిషి భావాలకు, మనసు స్పందనకు కారణాలు ఉండనవసరం లేదు.

యాధృచ్చికంగా దీనికి సంబంధించిందే రోజు పొద్దునే 'మధురవాణి' లో ఒక quotation పోస్ట్ చేశాను. మనలో ఏదయినా ఒక అలవాటుని గానీ, అభిరుచిని గానీ మన ఇష్టానికి వ్యతిరేకంగా మార్చుకోవాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. పెద్ద పెద్ద విషయాల దాక వెళ్లనవసరం లేదు కానీ.. పొద్దున్నే లేవడం, ఇష్టం లేని టిఫిన్ చేయడం.. ఇలాంటి చిన్న చిన్నవాటిని కూడా మార్చుకోవాలంటే మన తల ప్రాణం తోకకి వస్తుంది. కానీ.. మరి మనం వేరే వాళ్ళయితే మార్చుకోవాలని బాగా expect చేస్తాము. చాలా అసహనానికి గురవుతుంటాం కూడా.. వేరే ఎవరి దగ్గరో కాదు గానీ, ఇది ఎక్కువగా మన కుటుంబ సభ్యుల దగ్గర గానీ, స్నేహితుల దగ్గర గానీ చేస్తూ ఉంటాం. వాళ్లు ఒక విషయంలో మారట్లేదని విసుగు చెందేముందు ఒక్కసారి మన మార్పు గురించి ఆలోచిస్తే మనం వాళ్ళని వాళ్లుగానే సంతోషంగా స్వీకరిస్తాం. అసలు నిజమైన అభిమానం, ప్రేమ అంటే.. వారి సుగుణాలతో పాటు బలహీనతల్ని కూడా ప్రేమించడమే.

మరో సంగతి ఏంటంటే.. వాళ్ల అభిప్రాయం మనకి నచ్చనంత మాత్రాన అది తప్పని కాదు కదా..! కోణంలో మాత్రం ఎప్పుడూ ఆలోచించం అసలు. ఎందుకో ఒప్పుకోబుద్ది కాదు. కానీ.. దాన్ని మనం అధిగమించగలగాలి. అప్పుడే విసుగు, చిరాకులాంటివి మన దరిచేరవు. మనమేదో గొప్పగా కష్టపడిపోయి వాళ్ళని భరిస్తున్నట్టు చాలాసార్లు భావిస్తూ ఉంటాం కూడా..! ముందు అసలు భావం మనకి రాకుండా ఉండాలి. అప్పుడు మనకి regrets ఉండవు బంధంలోనైనా.. రోజు రోజుకీ మన సంతోషం నిల్వలు పెంచుకుంటూ పోవచ్చు.

అంచేత.. నేను చెప్పొచ్చేదేంటంటే.. అధ్యక్షా..! మనందరం మన మనసు గదుల్లో మనం ఇష్టపడేవారితో పాటు వారి ఆసక్తులకీ, అనాసక్తులకీ, అభిప్రాయాలకీ, కోరికలకీ, ఇష్టాలకీ, అయిష్టాలకీ, భావాలకీ, ప్రేమకీ, బలహీనతలకీ, కోపతాపాలకీ, విసుగుకీ, చిరాకుకీ... అన్నీటికీ చోటుని పంచుదాం..! ఒకేసారి మహాత్ములం అయిపోలేం కానీ.. కనీసం ప్రయత్నిద్దాం.. ఏదో ఒక రోజు పూర్తిగా ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకోగలమనే గమ్యం వైపు..!

ప్రేమతో...
మధుర వాణి

Sunday, November 16, 2008

ఎవరున్నారని నాకైనా.. ఎవరున్నారని నీకైనా.. ఎవరున్నారని నీలా నాకైనా..!

హలో హలో..
ఇప్పుడు మీ అందిరికీ మరో కొత్త కోయిల స్వరాన్ని వినిపించబోతున్నాను. నేను మధ్యనే పాటని విన్నాను. పాట బావుందనిపించింది. అందుకే మీతో కూడా ఒక మాట చెప్దాం అనిపించింది. ఇంతకీ పాట పల్లవి పైన పేరులో చూశారుగా.. అదే.. "ఎవరున్నారని నాకైనా.. ఎవరున్నారని నీకైనా.. ఎవరున్నారని నీలా నాకైనా..!". పాట మధ్యనే రిలీజ్ అయిన 'యువత' అనే సినిమాలోనిది. 'హ్యాపీ డేస్' చిత్రంలో రాజేష్ గా అందరినీ ఆకట్టుకున్న నిఖిల్ సిద్ధార్థ్ సినిమాలో కథానాయకుడు. కొత్త అమ్మాయి అక్ష హీరోయిన్ గా నటించింది. యువత స్నేహం, ప్రేమ చుట్టూ కథను అల్లారు దర్శకులు పరశురామ్. దర్శకుడిగా ఆయనకిదే తొలి చిత్రం. సినిమాకి సంగీతం మణిశర్మ, సాహిత్యం కృష్ణ చైతన్య అందించారు. మృదువుగా సాగిపోయే ప్రేమ గీతాన్నిహేమచంద్ర, హరిణి చాలా బాగా పాడారు. సాహిత్యం కూడా బావుంది. మీరూ ఒకసారి చూడండి. మెల్లగా సాగిపోయే మెలోడీస్ ని ఇష్టపడే వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది.



ఎవరున్నారని నాకైనా.. ఎవరున్నారని నీకైనా..
ఎవరున్నారని నీలా నాకైనా..!
ఎవరున్నారని నాకైనా.. ఎవరున్నారని నీకైనా..
ఎవరున్నారని నాలా నీకైనా..!


గాలై నిను తాకెయ్ నా .. నిప్పై నిను కాల్చెయ్ నా..

వానై నిను తడిపెయ్ నా.. తడిసే వయసున..

ఎవరున్నారని నాకైనా.. ఎవరున్నారని నీకైనా..
ఎవరున్నారని నీలా నాకైనా..!


మగువా.. తగువా.. మాటల గొడవా..
చనువా.. చొరవా.. ఆట..

అలవా.. వలవా.. అలలో జడివా..
వినవా వినవా నా మాట..!


తడి ఆరని బాటని దాటనీ.. అణువణువుని నేనే అనీ..
చేరని నీడని తాకనీ.. తనువున తడి తానే అనీ..
నును వెచ్చని శ్వాసని నేననీ.. వణికిన చలిలో రానా..!
తను మెచ్చిన నా మది లేదనీ.. నలువైపులా తానేననా..!


గాలై నిను తాకెయ్ నా .. నిప్పై నిను కాల్చెయ్ నా..

వానై నిను తడిపెయ్ నా.. తడిసే వయసున..

కలతా.. వనితా.. కలలా కవితా..
చరితా.. భవితా.. నీవేగా..!
జనతా.. యువతా.. తిడితే పడతా..
చెడితే చెడతా.. నేనేగా..!


సుడిగాలిని రివ్వని రాకనీ.. తన మొర విని పోవే అనీ..
నాదని నీదని ప్రేమనీ.. ఎవరెవరిని అంటారనీ..
పసిపాపని కానని తానని.. అలిగిన చెలి లోలోన..
చెలి తాకని చూపుని దాచనీ.. కలిగిన గిలి నాదేనా..!


గాలై నిను తాకెయ్ నా .. నిప్పై నిను కాల్చెయ్ నా..
వానై నిను తడిపెయ్ నా.. తడిసే వయసున..


ఎవరున్నారని నాకైనా.. ఎవరున్నారని నీకైనా..
ఎవరున్నారని నీలా నాకైనా..!